Friday, July 3, 2009

వినకుంటే, చూడకుంటే.. ఊరుకుంటుందా?

బీరువా అరల్లో సొంపుగా సర్దివుంచిన ఓ పాతిక ప్రథమశ్రేణి చీరల్లోంచి, ఆ రోజు కట్టుకోవలసిన రంగులను ఎంపిక చేసుకోడానికి మీకు నిమిషం కన్నా ఎక్కువ సేపు పట్టకపోతే బయట మీ గురించి ఆలోచించేవారు ఎవరూ లేరనే! ఎట్లీస్ట్‌... మిమ్మల్ని మీరు పట్టించుకోవడం లేదనే. దీనినొక అసహజమైన మానసిక స్థితిగా గుర్తించడానికి మీరు సుముఖంగా ఉన్నట్లయితే వెంటనే వెళ్ళి - ఒంటరిగానే అయినా - ఒక బాలీవుడ్‌ సినిమా చూసి రండి. అయితే అది ‘జిస్మ్‌’ శకారంభ అనంతర చిత్రం అయి ఉంటే మంచిది. అందులో మింకీ నునుపైన నాభి నుంచి ఐస్‌ ముక్కలు చల్లగా దిగువకు జారడం వంటి సన్నివేశాలను చూడలేకపోతే మీ ఇష్టం. ఆ కాసేపూ కళ్ళు మూసుకోవచ్చు. ‘ఖ్వాహిష్‌’లో మల్లికా శరావత్‌ తొలిరాత్రి శోభనం గదిలో భర్త హిమాంశు మాలిక్‌తో బిడియం వీడి, నిస్సిగ్గుగా చెప్పిన రెండు డైలాగులను మీ సంప్రదాయ దేహం తిరస్కరించవచ్చు. పోనీ వినకండి. ఎమ్రాన్‌ హష్మీ ముద్దులకు మెలికలు తిరిగిపోయే కథానాయిక కూడా మీకు ఎక్కడైనా తగలొచ్చు. ఆవిడ పాపానికి ఆవిడను వదిలేయండి. ‘ఛమేలీ’లో కరీనాకపూర్‌ జీవన విధానాన్ని పరికించడమా లేక ఆవిడ మేనిఛాయకు ఈడూజోడుగా ప్రతిఫలిస్తున్న అలంకరణల వర్ణ మిశ్రమాలను గుర్తు పెట్టుకుని అనుకరించడమా అన్నది పూర్తిగా మీ స్వభావాన్ని బట్టే ఉంటుంది కదా. అయినా సరే మీరు మారిపోతారు! థియేటర్‌ నుంచి బయటికి రాగానే మీ ప్రపంచం మారిపోతుంది. ఎందుకంటే - బాలీవుడ్‌ మారిపోయింది. భారతీయాత్మను నుదుటి బొట్టులా శోభిస్తున్న హిందీ చలన చిత్రాలు... మూడు పదులు దాటిన ఎన్నారై ఆడపడుచులను సైతం నిలువుటద్దాల ముందు నుంచి కదలనివ్వడం లేదు. కత్రీనా కైఫ్‌, హెక్‌ చహల్‌, జియాఖాన్‌ వంటి వారైతే టీనేజ్‌లోనే బాలీవుడ్‌ చేరిక కోసం చీరంచులు, కుచ్చిళ్ళు సవరించుకున్నారు. మార్చి మార్చి కట్టుకున్నారు. అభినయ ప్రతిభను రహస్యపు ఏకాంతంలో ప్రదర్శించి చూసుకున్నారు. భారత్‌లో హిందీ సినిమా... కార్పొరేట్‌ సంస్థల బ్రాండ్‌ అయింది. విదేశాలకు సాంస్కృతిక రాయబారిగా వెళుతోంది!! ఒక్కటైనా సినిమా తియ్యడం ఇప్పుడు టాటా ఇన్ఫోమీడియా, కె సెరా సెరా, పాంటలూన్‌, ఇ-సిటీ, మెటాలైట్‌ల ప్రతిష్ట! మల్టీప్లెక్స్‌ల మొగల్‌... మన్మోహన్‌ శెట్టి, మాఫియా థీమ్‌ల ముభావి రామ్‌గోపాల్‌ వర్మ... ఇంకా తనూజా చంద్ర, సుజయ్‌ ఘోష్‌, అపర్ణాసేన్‌, సుధీర్‌ మిశ్రా, ప్రీతిష్‌ నంది... వీరిలో ఎవరు ఎప్పుడు మనల్ని మింగేస్తారో తెలీదు. మొత్తానికైతే మనసు, దేహం సరెండరైపోతాయి.

సమయం: 2006 జూలై 9 ('వార్త ' సండే )

సందర్భం: ఎల్లలు దాటిన బాలీవుడ్‌ సమ్మోహన పరిశ్రమకు లొంగిపోయిన ఓ చిత్ర ప్రేమికుడు... జోనాథన్‌ తర్గోవ్నిక్‌. జొనాథన్‌... న్యూయార్క్‌ ఫొటోగ్రాఫర్‌. బాలీవుడ్‌ క్లాపర్‌ బోర్డు వెనుక కథల్ని, కల్చర్‌నీ మెల్‌బోర్న్‌లోని ‘ఇమిగ్రేషన్‌ మ్యూజియం’లో ప్రదర్శిస్తుంటారు ఆయన. ఇండియన్‌ సినిమా సమ్మోహనశక్తి నుంచి ఏ దేశమూ, ఏ మనిషీ తప్పించుకోలేరని ఆయన అంటారు. ఇతర భాషా చిత్రాలతో కలిపి భారత్‌లో ఏటా 900 సినిమాలు తయారవుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా వీటిని వంద కోట్ల మంది ప్రేక్షిస్తున్నారు. వీరిలో 50 కోట్ల వరకూ 25 ఏళ్ళ లోపు భారతీయులే. గత కొన్నేళ్ళుగా హిందీ చలన చిత్రాలు కొత్త జీవన శైలులను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాయి. వాటికి విదేశీయులూ ప్రభావితం అవుతున్నారు.ఈ నేపథ్యంలో - జొనాథన్‌ ఎగ్జిబిషన్‌కు మెల్‌బోర్న్‌లో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు చూశాక.

జ్ఞాపకం: ఆఫీసులో స్ర్తీమూర్తులు నా నుండి దూరంగా జరగడం మొదలైంది ఈ ఐటమ్‌తోనే.