Wednesday, July 8, 2009

ఏడు మల్లెలెత్తు రాకుమారుడు!

భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. ఒకే ఒక భారతీయుడికి మాత్రం స్వాతంత్య్రం 2009 జూలై 2న వచ్చింది. ఆ జంటిల్మన్‌... మన్వేంద్రసింగ్‌ గోహిల్‌! పూర్తి పేరు ‘యువరాజ్‌ శ్రీ మన్వేంద్ర సంఘ్‌జీ రఘువీర్‌ సింఘ్‌జీ సాహిబ్‌’.ఖడ్గంలాంటి పేరు! పువ్వులాంటి మనిషి!! ఇండియా అంటే మన్వేంద్రకు ‘గే’ ఇండియా మాత్రమే. ఆయన ఏనాడూ మన జెండాను ఎగరేయలేదు. ఎగురుతున్న జెండాకు సెల్యూట్‌ చేయలేదు. మన్వేంద్ర స్వీడన్‌ వెళ్ళినప్పుడు ఒక బ్రిటన్‌ సంతతి మర్యాదస్థుడు ఆయనను కలిశారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే 377 సెక్షన్‌ను (1860) ప్రవేశపెట్టిన బ్రిటిష్‌ వలస పాలకుల తరఫున ఆయన అత్యంత అపరాధ భావనతో చేతి వేళ్ళు విరుచుకుంటూ మన్వేంద్రను క్షమాపణలు కోరారు. ‘గార్డియన్‌’ పత్రిక ప్రతినిధి గారెత్‌ మెక్లీన్‌కి ఈ విషయం చెబుతూ - ‘‘బాధపడవద్దని ఆ జంటిల్మన్‌తో అన్నాను. పాపం ఆయన తప్పేముంది? 1860లో మేము స్వాతంత్య్రాన్ని కోల్పోయాం. అదింకా రాలేదు’’ అన్నారు మన్వేంద్ర ఆవేదనగా. ఎట్టకేలకు...ప్రిన్స్‌ మన్వేంద్ర యవ్వనంలోకి వచ్చిన ముప్పై ఏడేళ్ళ తర్వాత...ఢిల్లీ హైకోర్టు భారతదేశానికి స్వాతంత్య్రాన్ని ప్రకటించింది! స్వలింగ సంపర్కం తప్పేమీ కాదని ‘గే’ల బుగ్గలు పుణికింది.తీర్పు వెలువడిన వెంటనే దేశమంతటా ‘గే’ లు వీధులలోకి వచ్చి, ఒకరి బాహువులలో ఒకరు మైమరచి ఆడారు, పాడారు. జల్లులై కురిసిన విరహపు ఆవిర్లలో తడిసి, నడి వేసవి చెంపలకు సుతారంగా గులాబీ రంగులు అద్దారు. బయట ఇంత జరుగుతుంటే -ప్రిన్స్‌ మన్వేంద్ర మాత్రం గుజరాత్‌లోని తన రాజ్‌పిప్లా రాజప్రాసాదంలో గురువర్యులు పురుషోత్తం వలవల్కర్‌ చెంతన లలిత సంగీత సాధనలో లీనమైయున్నారు! ఆత్మ శాంతిస్తే మనసు చిందులు వేయదు. ఉద్యమ సారథిని విజయం ఉద్వేగపరచలేదు.ఇప్పుడు కాదు, ‘‘ప్రజలారా వినండి. నేను గే ని’’ అని అంతఃపురం నుండి ధైర్యంగా ప్రకటించుకున్నప్పుడే మన్వేంద్ర విజేత అయ్యాడు. జగదేక ‘గే’ వీరుడయ్యాడు. గే జీవుల ఆత్మ, పరమాత్మ అయ్యాడు.
***
ప్రిన్స్‌ మన్వేంద్రసింగ్‌ గోహిల్‌ జీవితానికి, ప్రిన్స్‌ అకీమ్‌కు దగ్గరి పోలికలు ఉన్నాయి. ఇద్దరిదీ బద్దలైన హృదయమే. అయితే అకీమ్‌ది కల్పిత బాధ. 1988 నాటి ఎడ్డీ మర్ఫీ చిత్రం ‘కమింగ్‌ టు అమెరికా’లో ప్రిన్స్‌ అకీమ్‌ ఒక పాత్ర మాత్రమే. జమండా అనే ఒక సంపన్న దేశపు రాకుమారుడు అకీమ్‌. పెద్దలు కుదిర్చిన వధువును కాదని, తన కలలరాణిని వెతుక్కుంటూ స్నేహితుడితో కలిసి అమెరికా వెళతాడు. చివరికి న్యూయార్క్‌లో అతడి జన్మసార్థకమౌతోంది. లీసా అనే యువతి ప్రేమలో పడతాడు. లీసా తండ్రికి ఒక రెస్టారెంట్‌ ఉంటుంది. ఆఫ్రికన్‌ యూనివర్శిటీ విద్యార్థులమని చెప్పుకుని మిత్రులిద్దరూ అందులో తిష్టవేస్తారు. కాలక్రమంలో లీసా కూడా అకీమ్‌ను ప్రేమిస్తుంది. అకీమ్‌ రాజపుత్రుడని తెలిశాక అతడి ప్రేమను తిరస్కరిస్తుంది.మన్వేంద్రను అలా తిరస్కరించిన అమ్మాయి... అతడి భార్య చంద్రికా కుమారి!వివాహానికీ, విడాకులకు మధ్య ఏడాది వ్యవధిలో వందల కొద్దీ నిద్రలేని ఒంటరి రాత్రులను గడిపారు మన్వేంద్ర. ‘‘1991లో మా పెళ్ళి జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఝుబువా నుంచి ఎన్నో ఆశలతో నా జీవన సహచరిగా మా అంతఃపురానికి వచ్చింది చంద్రిక. శయన మందిరంలో ఆమె గుర్తించి చెప్పేవరకు నాలోని అసహజత్వమేమిటో నేను తెలుసుకోలేకపోయాను. అప్పటి వరకూ మగాళ్ళంతా నాలాగే మగాళ్ళకు ఆకర్షితులౌతారని అనుకునేవాడిని’’ అని రెండేళ్ళ క్రితం ‘గే అరౌండ్‌ ది వరల్డ్‌’ అనే టాక్‌ షోలో ఓప్రా విన్‌ఫ్రే ముందు తొలిసారి మనసు విప్పారు మన్వేంద్ర. ‘కలయిక’లోని వైఫల్యం మన్వేంద్ర దాంపత్యాన్ని కల్లోల పరిచింది. తల్లిదండ్రులతో ఆయన సంబంధాలు దెబ్బతిన్నాయి. కుమారుడి ‘అపరిపూర్ణత’ వల్ల వంశ ప్రతిష్ట భ్రష్టుపట్టి పోయిందని తండ్రి వ్యధ చెందాడు. ఒకే ఇంట్లో ఉంటున్నా కొడుకు ముఖం చూడకుండా రాజమాత తలతిప్పుకుని పోయేవారు. మన్వేంద్ర ఇవేవీ పట్టించుకోలేదు. లోకం దృష్టిలోని తన అసహజత్వానికి ఆయన గౌరవాన్ని ఆపాదించుకున్నారు. ‘గే’లకు గౌరవం తెచ్చిపెట్టారు. వారి కోసం, వారి పక్కన నిలబడ్డారు. గే లతోకలిసి, గే లను కలుపుకుని ఎయిడ్స్‌పై ఉద్యమించడానికి 2005లో రాజభవనం వదలి బయటికి వచ్చారు. ఇప్పుడాయన ‘గే’ల ఆత్మగౌరవ అధినాయకుడు. ‘గే’లు గౌరవించే ‘రజనీష్‌’. ‘గే’లకు సార్వజనీనమైన ప్రేమను పంచే ఓషో. ఎల్‌.జి.బి.టి. (లెస్బియన్‌, గే, బెసైక్సువల్‌, ట్రాన్స్‌జెండర్‌) హక్కుల కోసం గత నాలుగేళ్ళుగా ఆయన అమెరికా, ఐరోపాదేశాలలో పర్యటిస్తున్నారు. పబ్బులలో గడుపుతున్నారు! ఈ ఏడాది బ్రెజిల్‌లో, నిరుడు స్వీడన్‌లో జరిగిన ‘యూరో ప్రైడ్‌’ గేల మహాసభలకు ముఖ్య అతిథి ఆయనే! 2010లో వార్సాలో జరిగే సదస్సుకు కూడా ముందస్తు ఆహ్వానం అందింది. బి.బి.సి-త్రీ ఆయనతో ‘అండర్‌కవర్‌ ప్రిన్సెస్‌’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి ఈ జనవరిలో నాలుగు ఎపిసోడ్‌లుగా ప్రసారం చేసింది. ‘కమింగ్‌ టు అమెరికా’ చిత్రాన్ని పోలివున్న ఆ రియాల్టీ షోలో మన్వేంద్రతో పాటు జాఫ్నా రాకుమారుడు రెమిజియస్‌ జెర్రీ కనగరాజ్‌, దక్షిణాఫ్రికా యువరాజు ‘జులు’ కూడా పాల్గొన్నారు. ఇంగ్లండ్‌ దక్షిణ తీర ప్రాంతమైన బ్రిగ్టన్‌లో వీరి మకాం. ముగ్గురూ కలిసి ఉండేవారు. పగలు మారువేషంలో వధువు వేటకు బయల్దేరేవారు. బార్‌మన్‌గా, వెయిటర్‌గా, హౌస్‌ కీపర్‌గా చేరి రహస్యంగా తమ డ్రీమ్‌గర్ల్‌ కోసం వెదకులాడేవారు. చివరికి ముగ్గురూ వధువు అన్వేషణలో విఫలమయ్యారు. ఒక్క అమ్మాయినైనా వలలో వేసుకోలేకపోయారు. ఇంతకీ అమ్మాయిలకు ఏం కావాలి? మగాళ్ళలో వారేం కోరుకుంటారు?అందం - డబ్బు - చదువు - సంస్కారం - వంశం.... ‘‘ఏదీ కాదు’’ అంటారు మన్వేంద్ర.‘‘మనసు చిత్రమైనది. ఎప్పుడు ఎవర్ని ఎందుకు కోరుకుంటుందో తెలీదు. ప్రేమ ఎవరి మధ్య ఏ కారణంతో అంకురించినా, అసలు కారణమే లేకుండా అంకురించినా... ఆ ప్రేమ భావాన్ని గౌరవించడం నాగరికుల బాధ్యత. స్ర్తీ పురుషులు మాత్రమే ప్రేమించుకోవాలని ఎవరైనా అంటే... అలా అన్నవారు మానవ పరిణామ దశలో ఎక్కడో ఆగిపోయారనే అనుకోవాలి..’’ అని రియాల్టీ షో ముగింపు కార్యక్రమంలో అన్నారు మన్వేంద్ర.
***
ఒక క్షత్రియ పుత్రుడు.. ‘అమ్మయ్యో’ అని చెంపకు చెయ్యి ఆన్చి, అంతఃపురంలో గాలికి ఊగుతున్న పొడవాటి పరదాల చాటునుంచి కళ్ళు టపటపలాడిస్తూ... రాజప్రాసాదానికి వచ్చివెళుతుండే మగధీరులను గుబగుబలాడే గుండెలతో వీక్షించడంలోని అసహజత్వాన్ని వంశగౌరవానికి సంబంధించిన విషయంగా భావించిన రాజకుటుంబం... విషయాన్ని గుట్టుగా ఉంచాలని ప్రయత్నించింది. కానీ, ఆ అసహజత్వాన్ని తన విలక్షణమైన స్వభావంగా భావించిన రాకుమారుడు మన్వేంద్ర తనే స్వయంగా మీడియా ద్వారా నిజాన్ని లోకానికి చాటారు. ప్రిన్స్‌ మన్వేంద్రలోని ఈ అవాంఛనీయమైన సున్నితత్వం... తొలిసారిగా నాలుగేళ్ళ క్రితం బహిర్గతమైనప్పుడు గుజరాత్‌ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. కూడళ్ళలో ఆయన ప్రతిమలు దగ్ధం అయ్యాయి. పూర్వ వైభవాన్ని కాపాడుకుంటూ వస్తున్న రాజ్‌పిప్లా రాజ్యప్రతిష్ట మంచం పట్టింది. ప్రిన్స్‌ మన్వేంద్రకు... తండ్రి మహారాణా శ్రీ రఘువీర్‌ సంఘ్‌జీ రాజేంద్రసింఘ్‌జీ సాహిబ్‌... నీళ్ళు, నువ్వులు వదల్లేకపోయారు. ఇంట్లోంచి వెళ్ళగొట్టి మళ్లీ తెచ్చుకున్నారు. అయితే ఆయనకు అల్ప సంతోషం కలిగించే విషయం ఒకటి ఉంది.మగవాళ్ళను మాత్రమే ఇష్టపడే ప్రిన్స్‌ మన్వేంద్ర... పూర్తిస్థాయిలో తన లైంగిక అస్తిత్వాన్ని కోల్పోలేదు. ఆయనలో ఇంకా ఏ మూలనో మగువల పట్ల ఆసక్తి దాగి ఉన్నట్లుంది. ‘‘నేనే గనుక పరిపూర్ణ పురుషుడిని అయివుంటే మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటానని అడిగి ఉండేవాడిని’’ అని టాక్‌ షోలో విన్‌ఫ్రేను ఉద్దేశించి ఆయన అన్నారు. ఆ మాటకు విన్‌ఫ్రే ఎంతో హూందాగా స్పందించారు. ‘‘రాణివాసం బాగుంటుంది కదా’’అని అన్నారు. మన్వేంద్రసింగ్‌ ఆవిడను అంతగా ఇష్టపడడానికి తగిన కారణమే ఉంది. ‘‘నేను విన్‌ఫ్రే ఇంటర్వ్యూలు చూస్తూ పెరిగాను. వాస్తవం ఏమిటో అవాస్తవం ఏమిటో ఆవిడ సరిగ్గా అంచనా వేస్తారు. నిజాన్ని నమ్ముతారు. నిజం చెప్పేవారికి అండగా ఉంటారు. ఆవిడకు దగ్గరగా కూర్చుని మాట్లాడ్డం బాగుంటుంది. తన సమక్షంలో ఆ రెండు గంటలూ నాకెంతో ఉల్లాసంగా గడిచాయి’’ అని మన్వేంద్ర ‘గార్డియన్‌’ ఇంటర్వ్యూలో గారెత్‌ మెక్లీన్‌తో చెప్పారు.టాక్‌ షో పూర్తయ్యాక విన్‌ఫ్రేకు గణనాథుని విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేశారు మన్వేంద్ర. ఆ కానుకను ఎంతో అపురూపంగా స్వీకరించారట విన్‌ఫ్రే.
కోమలమైన మనసును క్రోమోజోములతో వర్గీకరించలేం.